కొన్ని వేల సంవత్సరాల
క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు.
ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి.అటువంటి ఆ మహారాజు
ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో
ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు.
ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి
ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు."రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా
ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు
నన్ను అనుమతించు" అన్నది ఆమె.మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు.
సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు.ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య
పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు
రాజు, ఆయనను.
"రాజా నేను
దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు.
నేనూ ధనాన్ని అనుసరించాల్సిందే. నీ రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు నన్ను అనుమతించు"
అన్నాడు ఆ దివ్య పురుషుడు.
"సంతోషంగా
వెళ్లండి" అని సాగనంపాడు మహారాజు.అంతలోనే మరొక దేవతామూర్తి బయటికి పోతూ కనబడింది
ఆయనకు. "తల్లీ! నువ్వెవ్వరు? ఎందుకు నన్ను వదిలి పోతున్నావు?" అడిగాడు రాజు."రాజా!
నేను కీర్తికాంతను. ధన సంపత్తీ, దాన సంపదా లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను. నన్ను వెళ్లనివ్వు"
అన్నది ఆ దేవతామూర్తి.
"సరేనమ్మా!
నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు." అన్నాడు రాజు.
ఇంకొంతసేపటికి
మరొక దివ్య మూర్తి బయటి దారి పట్టింది. రాజుగారు అడిగారు "స్వామీ! మీరెవ్వరు?"
అని."రాజా! నేను శుభాన్ని. సంపదా, దానం, కీర్తీ లేని ఈ రాజ్యంలో నేను ఉండీ ప్రయోజనం
లేదు. అందువల్ల నేను వారిని అనుసరించి పోవటమే మంచిది. నన్ను క్షమించి, పోనివ్వు"
అన్నాడా దివ్యమూర్తి. రాజుగారు శుభాన్నీ సాగనంపారు.'ఇంకా ఏమి చూడాల్సి వస్తుందోనని
రాజుగారు విచార పడుతుండగానే మరో దేవతా మూర్తి బయటికి పోతూ కనబడ్డది. "తల్లీ! నువ్వెవ్వరు?"
అని అడిగాడు సత్యవ్రతుడు.
"రాజా, నేను
సత్య లక్ష్మిని. ధనలక్ష్మీ, దాన లక్ష్మీ, యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ నిన్ను విడిచి
వెళ్ళిపోయారు. ఇక నీకు నా అవసరం ఉండదని, నేనూ పోనెంచాను. నాకూ అనుమతినివ్వు" అన్నది
సత్యం.రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి " తల్లీ! నీకు ఆ అవసరం ఏమున్నది? వేరే
ఏ సంపదనూ నేను కోరలేదు- వారంతట వారువచ్చారు; వారంతట వారు వెళ్ళారు. కానీ తల్లీ, నేను
నీ పూజారిని. సత్యాన్ని కోరి, సత్యం కోసమే జీవించే నన్ను వదిలి వెళ్లటం నీకు భావ్యం
కాదు. నన్ను వదిలి వెళ్ళకు!" అన్నాడు.
సత్యం సంతోషపడింది.
సరేలెమ్మన్నది. తిరిగి రాజ్యంలోకి వెళ్లిపోయింది.రాజుగారు నిట్టూర్చారు. సూర్యోదయం
కాబోతున్నది. రాజుగారు కూడా వెనుదిరిగి తమ మందిరానికి పోబోతున్నారు- అంతలోనే ఒక దివ్యమూర్తి-
ఈమారు ఆమె ప్రధాన ద్వారం గుండా రాజ్యంలోనికి ప్రవేశిస్తూ కనబడింది; చూడగా, ఆమె ధనలక్ష్మి!
"ఏం తల్లీ! మళ్ళీ వస్తున్నావు?" అడిగారు రాజుగారు."అవును సత్య వ్రతా!
సత్యం లేనిచోట నేనూ ఉండలేను. అందుకే తిరిగి వస్తున్నాను" అన్నది ధనలక్ష్మి.అంతలోనే
దానలక్ష్మీ, ఆపైన యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ ఒకరి తరువాత ఒకరు తిరిగి వచ్చారు రాజ్యానికి.మళ్లీ
రాజ్యం కళకళలాడింది.
ఉపనిషత్తులలోని
ఈ కథ, సత్యం ఎంత గొప్ప సంపదో వివరిస్తున్నది. అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది
నిజంగానే గొప్ప సంపద. ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యమేలుతున్నట్లు అనిపిస్తుంది కానీ,
అంతిమంగా నిలిచేది సత్యమే, సందేహం లేదు.
Comments
Post a Comment